Skip to main content

ఇమ్రాన్ ఇండియాను ఎందుకు పొగిడాడు?

పాపం.. పాక్ లో ఇమ్రాన్ పరిస్థితి పైనే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. తాను గెలిచి దేశాన్ని ఓడించాడా? లేక తాను ఓడి దేశాన్ని గెలిపిస్తున్నాడా? ఈ చిక్కు ప్రశ్నలకు మూలాలెక్కడున్నాయో మనకే కాదు.. ఇమ్రాన్ కి కూడా అర్థం కావడం లేదు. అలాగే ఇండియా మీద ప్రశంసలు ఆయనకు కలిగిన జ్ఞానోదయాన్ని సూచిస్తున్నాయా.. లేక పాము చచ్చినా పగ మాత్రం చావదన్న జాతి నైజాన్ని సూచిస్తున్నాయా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

భారత రాజకీయాలపై పాకిస్తాన్ కు ఆసక్తి ఉన్నట్టే.. పాక్ రాజకీయాలపై కూడా భారత ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. పాక్ ను పక్కలో బల్లెంలా సగటు భారతీయుడు ఎలా భావిస్తాడో.. భారత్ ను డిస్టర్బ్ చేయాలన్న దుర్బుద్ధి అక్కడి ఎక్కువ మంది పౌరుల్లో ఉంటుంది. దీనిక్కారణమేంటో అందరికీ తెలిసిందే. ద్విజాతి సిద్ధాంతం మీద దేశాన్ని బలవంతంగా విడగొట్టారన్న ఫీలింగ్ భారతీయుల్లో బలంగా పాతుకుపోయి ఉండడమే. అటు వాళ్లూ అంతే. ఇండియాను వాళ్లు ఏనాడూ పొరుగుదేశంగా చూడలేదు. ఇండియాతో శాశ్వత జాతివైరమే వారి దృష్టిలో శాశ్వతమైన ఎజెండా. కాబట్టి ఈ రెండు పొరుగు దేశాల వ్యవహారాల్లో శత్రుబద్ధమైన వైఖరి అలా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇమ్రాన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఇమ్రాన్ ప్రధాని పదవి త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆయన భారత్ గురించి కొన్ని కఠోరమైన వాస్తవాలు మాట్లాడాడు. ఆ వాస్తవాలు ఆయనకు, ఆయనలాగే కోట్లాది పాక్ పౌరులకు జీర్ణం కానివే అయినా.. మాట్లాడాడు. 

ఇండియాను ఏ సూపర్ పవర్ కంట్రీ కూడా డిక్టేట్ చేయలేదని... బుల్లెట్ పాయింట్ లాగా ఇండియా గురించి ఒక్క మాటలో చెప్పేశాడు. ఒకరి శక్తి సామర్థ్యాలేంటో వాళ్ల కన్నా వాళ్ల శత్రువులకే బాగా తెలుస్తాయన్నది ఇమ్రాన్ మాటలు రుజువు చేశాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇండియాను శాసించజాలదని ఇమ్రాన్ రూఢిగా అర్థం చేసుకున్నాడు. మొన్నటికి మొన్న రష్యా విదేశాంగ మంత్రి  సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించినప్పుడు ఇండియా ఏది కోరితే అది ఇస్తామని బాహాటంగా డిక్లేర్ చేశాడు. ఇండియాతో స్నేహానికి ఎంత దూరమైనా వెళ్తామన్నాడు. ముందుగా జైశంకర్ ను కలిసి.. అంతర్జాతీయ అంశాలపై భారత వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకున్నాక.. ప్రధాని మోడీని కలిశాడు లావ్రోవ్. ఆ తరువాత ప్రెస్ కు పూర్తి క్లారిటీ ఇచ్చాడు. భారత్ పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. భారత్-రష్యా స్నేహబంధం బరాబర్ గా ఉండి తీరుతుందని అగ్రరాజ్యాన్ని ఉడికించాడు. అటు అమెరికా కూడా రష్యాతో భారత వైఖరిని మింగలేక, కక్కలేక.. ఏమనాలో తెలియక పిల్లిమొగ్గలేసింది. అంతకుమించి ముందుకెళ్తే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రకటించింది. ఆంక్షల గురించి మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి... రిక్వెస్టు లాంటి హెచ్చరికను జారీ చేసింది. అయితే అమెరికా హెచ్చరికను భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. మరి.. భారత్ కో ఇత్ నా హిమ్మత్ కహా సే ఆయీ? ఇండియాలో ప్రతిపక్ష పార్టీలకు అర్థం కాకపోవచ్చు గానీ.. ఇమ్రాన్ కు మాత్రం సెంట్ పర్సెంట్ తలకెక్కింది.

అది ఒక పార్శ్వమైతే.. ప్రపంచానికి అర్థమైన రెండో పార్శ్వం మరోటి ఉంది. రష్యా భారత్ మీద ఎంత నమ్మకాన్ని కనబరచిందో అంతే నమ్మకాన్ని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ నమ్మకాన్నే ఉక్రెయిన్ వ్యక్తం చేసింది. భారత్ తల్చుకుంటే యుద్ధం ఆగుతుందని జెలెన్ స్కీ ఓపెన్ గా విజ్ఞప్తి చేయడం.. మనమేంటో ప్రపంచానికి చాటినట్లయింది. ప్రపంచంలో ఉన్న ఏ అగ్రరాజ్యం మీద కూడా పెట్టుకోని భరోసా.. ఉక్రెయిన్ మన మీదనే పెట్టుకుంది. అందుక్కారణం ఒక్కటే. అగ్రరాజ్యాలైనా, అథో రాజ్యాలైనా.. ఇతరుల అవసరాలపై అవకాశాలు వెదుక్కుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వ్యాపారాలు చేస్తాయి. తమ వ్యాపారానికి పనికొస్తే చేయూతనిస్తాయి... లేదంటే తొక్కేస్తాయి. అమెరికా చేస్తున్నది ఇదే కదా. కానీ భారత్ అలా ఎప్పుడూ చేయలేదు. ఎవరితోనూ చేయలేదు. భారత్ ఎలాంటిదో ప్రపంచం ముందు తెరిచిన పుస్తకమే. అమెరికా అందుకు భిన్నం. దాని లోగుట్లు ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. మొన్న ఆఫ్ఘన్లో అమెరికా ఏం చేసిందో ప్రపంచమంతా చూసింది. తన గాలి తానే తీసేసుకుంది అమెరికా. అలాంటి అమెరికా భారత్ తో జరిగే వ్యాపారాన్ని కాలదన్నుకుంటుందా? వరదన పోయే వ్యాపారి ఊరికే పోడన్న సామెతలాగా ఎవరూ నమ్మలేకుండా తయారైంది అమెరికా పరిస్థితి. అయినా అమెరికాను ఎదిరించాలంటే గట్స్ కావాలి. ఆ గట్స్ ను ఇప్పుడు ఇండియా పుష్కలంగా సముపార్జించుకుంది. ఈ తత్వం ఇమ్రాన్ కు సెంట్ పర్సెంట్ బోధపడింది. అందుకే పాకిస్తాన్ లోని రాజకీయ పార్టీలు ఇండియాను చూసి నేర్చుకోండ్రా.. అంటూ ప్రధాని హోదాలో చివరిమాటగా చెప్పాడు. ఎందుకంటే ప్రధానిగా మాట్లాడే అవకాశం మళ్లీ రాదన్న విషయం ఆయనకు తెలుసు. పాక్ ప్రజల కోసం తానెంత కష్టపడ్డాడో.. ఆర్థికంగా నిలబెట్టడానికి ఎంత ట్రై చేశాడో.. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా మార్చేశారని, అందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చివరి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరో వచ్చి మీ దేశాన్ని బాగు చేయరు. మీకై మీరే ముందుకు రావాలి. వీధుల్లోకి రావాలి. నాతో కలిసి పోరాడాలి. నీను మీతో పాటే ఉంటాను. ఎక్కడికీ పారిపోను. దేశ పరిస్థితి ఇంకా దిగజారిపోక ముందే ఎంతో భవితవ్యం ఉన్న దేశ యువతరం అడ్డదార్లు తొక్కకుండా ఉండాలంటే.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంగట్లో పశువుల్లాగా అమ్ముడు పోకుండా ఉండాలంటే.. రండి.. శాంతియుతంగా పోరాడదాం.. అంటూ ఆఖరి అస్త్రం వదిలాడు. 

ప్రధాని హోదాలో ఇమ్రాన్ పోతూపోతూ చెప్పిన ఆఖరు మాటలు.. పాక్ చరిత్రలో నమోదు కావాలన్నదే ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. దేశంలో రాజ్యమేలుతున్న అరాచకం, దేశాన్ని తేరుకోలేనంతగా ముంచేస్తున్న అవినీతి, ఆశ్రితపక్షపాతం, సైన్యం జోక్యం, అమెరికా వేసే ఎత్తులకు పావులుగా మారుతున్న ప్రతిపక్షాలు, స్వపక్షంలోని తిరుగుబాటుదార్లు, చివరిగా ప్రజలు.. ఇలా దేశంలో ఏం జరుగుతుందో.. అందరూ ఆలోచించాలని చెప్పాడు. మరి.. ఇమ్రాన్ కు అంత తెలివే ఉంటే... ఇంత మంచి ఇండియాతో వైరాన్ని కాక శత్రుత్వాన్ని ఎందుకు పెంచుకున్నాడు? పాక్ సైన్యం చెప్పినట్టల్లా ఎందుకు ఆడాడు? దశాబ్దాల శత్రుత్వాన్ని తుడిచేసుకొని కొత్త అధ్యాయం లిఖిద్దామని ఎందుకు భావించలేదు? కాశ్మీర్ ఇష్యూను ఎందుకు కెలికాడు? మనకు వ్యతిరేకమైన చైనాతో ఎందుకు చెట్టపట్టాలేసుకున్నాడు? ఈ తెలివి పదవి ఊడిపోతున్నప్పుడే రావాలా? శ్మశాన వైరాగ్యంలాగా ఈ మాటలు ఇప్పుడు చెప్పడం కన్నా.. అధికారంలో ఉన్నప్పుడే అమలు చేయవద్దని ఎవరైనా ఆపారా? ఇమ్రాన్ కైనా, రేపొచ్చే అతని బాబులకైనా పుర్రెలో బుద్ధి ఉండాలి కదా. ఉండాలని ఆశిద్దాం. 

Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?