Skip to main content

భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే అంశాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. బీజేపీ నేతల వ్యవహార శైలి మాత్రం అలాగే ఉందని నిపుణులు అంటున్నారు. చార్మినార్ వద్దనే గల భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రముఖ నేతలంతా దర్శించుకోవడం వల్ల భాగ్యలక్ష్మికి పాపులారిటీ వస్తుంది. జాతీయ మీడియా కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ పై ఫోకస్ చేస్తుంది. దీంతో చార్మినార్, హైదరాబాద్ వంటి అంశాలకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన సీట్లు గెల్చుకున్న బీజేపీ... జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో కొంతవరకు ఇప్పటికే సఫలీకృతమైంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పరంగానూ ఎమ్మెల్యేల సంఖ్యా బలం పెంచుకునేందుకు కృషి చేస్తోంది. ఫలితంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీ మొత్తంగా వ్యాపించే పథకంతో ముందుకెళ్తోంది. ఈ అన్ని ఎన్నికల ఫలితాల ఆలంబనతో భాగ్యనగర్ మీద ఓ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవడానికి వీలుగా వ్యూహం రచిస్తోంది. మహారాష్ట్రలో శివసేన సంఖ్యాబలాన్ని తగ్గించి.. ఉద్ధవ్ చేతనే ఔరంగాబాద్ పేరు మార్చిన వైనాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు. 

అసలింతకీ.. భాగ్యలక్ష్మి అమ్మవారు కేవలం సెంటిమెంటేనా? లేక చారిత్రకంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అన్న సందేహాలు కూడా ప్రజల్లోంచి వినిపిస్తున్నాయి. భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఇటీవలి కాలంలో వచ్చిందేమీ కాదని, చార్మినార్ కట్టినప్పుడే అక్కడ అమ్మవారి ఆలయం ఉండేదని కొందరు స్థానికుల ద్వారా తెలుస్తోంది. కాబట్టి.. చార్మినార్ వైభవం కింద నలిగిపోతున్న భాగ్యలక్ష్మి అమ్మవారి అడుగుజాడల్ని మళ్లీ ఓసారి ప్రజలకు వివరించే ఉద్దేశంతో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. చార్మినార్ నుంచి నగరం బయటకు వెళ్లడానికి అడుగున సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత వాటిని మూసివేశారని, ఆ సొరంగ మార్గాలపై అధ్యయనం చేయడానికి ఇటీవల కొద్ది నెలల క్రితం ఆర్కియలాజికల్ డిపార్టుమెంట్ అధికారులు సర్వే కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే అక్కడున్న కొందరు స్థానిక నాయకులు ఆర్కియలాజికల్ అధికారుల్ని బెదిరించి సర్వేను అడ్డుకున్నారని స్థానికులు చెబుతారు. ఒకవేళ ఆ ప్రక్రియ గనక పూర్తయితే బీజేపీ నేతల పేరు మార్చే ప్రక్రియకు మార్గం సులభమైనట్టేనని భావిస్తున్నారు. అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు హైదరాబాద్ లో ఎప్పుడు పెద్ద ఉత్సవాలు జరిగినా.. చలో భాగ్యలక్ష్మి అంటూ పాత సెంటిమెంట్ దిశగా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. 
బీజేపీ ఎజెండాలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఉందో.. అంతకన్నా ఎక్కువగా హిందూ సెంటిమెంట్ కే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. హిందూ సెంటిమెంట్లకు మూలం దేవాలయాలే. కాబట్టి దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల సంస్కరణ, దేవాలయాలకు ప్రత్యేక ప్రతిపత్తి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం తగ్గిస్తూ ఈ మధ్య కేంద్రం ఓ చట్టం కూడా తీసుకొచ్చింది. పలు రాష్ట్రాలు కూడా వివిధ స్థాయిల్లో చట్టం అమలు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ లో టీఆర్ఎస్-మజ్లిస్ మైత్రీ బంధానికి గండి కొట్టేలా.. సామాజికవర్గాలకు అతీతంగా హిందూ ఓటర్లను తమవైపు ఆకర్షించుకునేలా భాగ్యలక్ష్మి టెంపుల్ ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీంతో భాగ్యలక్ష్మి టెంపుల్ రానున్న మరికొన్ని రోజుల్లో మరింత పాపులర్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?