మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.
Also Read: విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా?
అలాంటి మహా పండితుడికి తగిన గుర్తింపు రాకపోవడం కాస్త చింతించాల్సిన విషయమేనని, అందుకు ఎవరినో నిందించడం కాకుండా.. మనల్ని మనం అర్థం చేసుకొని, మన శక్తియుక్తుల స్థాయేంటో తెలుసుకొని ఎదగడానికి ప్రయత్నించాలని నర్మగర్భంగా విశ్వబ్రాహ్మణులకు హితవు పలికారు. తన అవగాహన ప్రకారం మానవజాతిలో 4 రకాలైన మనుషులుంటారన్నారు మధుసూదనాచారి. 1) క్రియేటర్స్ (సృష్టికర్తలు లేదా సృజనకారులు), 2) ఇమిటేటర్స్ (అనుకరించేవారు), 3) స్పెక్టేటర్స్ (ప్రేక్షకులు), 4) ఫ్రస్టేటర్స్ (అసహనపరులు). ఈ నాలుగు రకాల మనుషుల్లో విశ్వబ్రాహ్మణులు మొదటి తరగతికి చెందినవారని, అది ప్రపంచానికి కూడా తెలుసని.. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించడంలోనే విశ్వబ్రాహ్మణులు విఫలమవుతున్నారన్నారు. పెదపాటి లాంటి మహా పండితుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగానైనా.. విశ్వబ్రాహ్మణ యువతీ యువకులు ఈ విషయం గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ సంతానాన్ని ఆ విధంగా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినన్ని అవకాశాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదన్నారు. నాగేశ్వరరావు, గంగాదేవి దంపతులకు మధుసూదనాచారి జంటగా శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి సన్మానించారు.
వందకు పైగా పుస్తకాలు ప్రచురించిన పెదపాటి సాహితీ సేద్యాన్ని గురించి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి కూలంకషంగా వివరించారు. మల్లినాథుని సూరి భాష్యమే లేకపోతే కాళిదాసు కవిత్వంలోని గొప్పదనం ప్రపంచానికి తెలిసేది కాదని.. అలంటి మల్లినాధుని సూరి కూడా పట్టుకోలేకపోయిన అంశాలను పెదపాటి నాగేశ్వరరావు నేటిి తరానికి అందించారన్నారు. సంస్కృతంలో ఉన్న విశ్వకర్మ పురాణాన్ని తేట తెలుగులోకి అనువదించారని, వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలోని వైశిష్ట్యం ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దాన్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేశారన్నారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, తమిళం, కన్నడం, మరాఠా వంటి అనేక భాషల్లో పాండిత్యం ఒలికించే వైదుష్యం పెదపాటి సొంతమని.. రచనా వ్యాసంగంలో ఆయన ఎంచుకున్న శిల్పాన్ని అద్భుతంగా విడమరచి చెప్పారు సుబ్బాచారి. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణను ఈ దేశం పట్టనంత పండితుడిగా చెబుతారని, అయితే ఆ పేరు విశ్వనాథ సత్యనారాయణ కంటే ఆచార్య పెదపాటికి ఇంకా బాగా సరిపోతుందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. దేశం గర్వించే స్థాయిలో సాహితీ సేద్యం చేసిన పెదపాటికి తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరమన్నారు. అందుకు పెదపాటి విశ్వబ్రాహ్మణుడిగా పుట్టడమేనని వాపోయారు. జీవితంలోని ఆఖరు మజిలీలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రావూరి భరద్వాజను సుబ్బాచారి గుర్తు చేశారు. విశ్వబ్రాహ్మణుల్లో ఇంతటి ఔన్నత్యం ఉన్న సాహితీవేత్తలు ఉన్నా.. తగినంత గుర్తింపుగానీ, తగినన్ని అవకాశాలు గానీ రాకపోవడానికి విశ్వబ్రాహ్మణుల్లో ఐక్యత లేకపోవడమేనని, అందువల్లే పాలకులు వీరి విజ్ఞానాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారన్నారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణులు తమ శక్తి ఏపాటిదో తెలుసుకొని రాజకీయంగా ప్రభావశీలంగా ఎదగాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు వేములవాడ మదన్ మోహన్.. పెదపాటి వాఙ్మయ సేవను ఎంతో కొనియాడారు. పెదపాటి నాగేశ్వరరావు, గంగాదేవి దంపతులను ఇలా వివాహ వేడుకగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఆయనలోని సాహితీ వైదుష్యాన్ని విశ్వబ్రాహ్మణజాతికి ఉపయోగపడేలా సంఘం తరఫున కృషి చేస్తానన్నారు. పెదపాటి శిష్యులు, అభిమానులు నిర్వహిస్తున్న మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. విశేష సంఖ్యలో పెదపాటి అభిమానులు, సాహితీ శ్రేయోభిలాషులు హాజరయ్యారు.
Comments
Post a Comment
Your Comments Please: