Skip to main content

టి-కాంగ్రెస్ లో ఎన్నడూ లేని జోష్.. కారణం ఇదే


తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఏ రేంజ్ లో ఉందంటే.. గెలుపుకు అర అంగుళం దూరంలోనే ఉన్నామన్న ఫీలింగ్ లో వారంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అధికారం అందుకోవడం ఖాయమైపోయిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తన సంతోషాన్ని, ఆనందాన్ని లోపలే దాచుకోవాల్సి ఉండగా.. బహుశా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతోనో ఏమో గానీ.. సీఎం కుర్చీ మీద కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేశారు జానా. మరి జానాలాగే మరికొందరు సీనియర్లు కూడా ఇదే వాయిస్ వినిపిస్తారా? కాంగ్రెస్ లో సీనియర్లకు ఎదురవుతున్న పరిస్థితులేంటి?

టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముందే 6 గ్యారెంటీ పథకాల హామీతో జనంలోకి చొచ్చుకుపోతోంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో టీ-పీసీసీ తొలి జాబితా విడుదల చేసింది. అయితే అందులో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిలో నైరాశ్యం అలముకుందన్న వార్తలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. రెండో జాబితా బయటకు రావాల్సి ఉన్నా.. తొలి జాబితాలోనే తమకు చోటు లేనప్పుడు.. ఇంక రెండో జాబితాలో ఎక్కణ్నుంచి ఉంటుందన్న నైరాశ్యం సీనియర్లలో వ్యక్తమవుతోంది. మరికొందరిలో రెండో జాబితాలో తమ పేర్లు కచ్చితంగా ఉంటాయన్న ధీమా కనిపిస్తోంది. అయితే టికెట్లు వచ్చే ఆస్కారం లేదనే సంకేతాలు అందుతుండడంతో పలువురు సీనియర్లు ఎలాంటి పంచాయతీకి తెరతీస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

టీ-కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన జానారెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జానారెడ్డి.. టీ-కాంగ్రెస్ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేశారు. హైకమాండ్ దగ్గర ఆయన మాటకు తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు విపరీతమైన చెల్లుబాటు ఉండేది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఒకటైతే.. టీ-పీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు అందుకున్నాక జానా ప్రభ మసకబారుతోంది. అయితే ఆయన రాజకీయ వారసత్వాన్ని పదిలం చేసుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన కుమారులను రాజకీయ ప్రవేశం చేయించి.. వారిని అసెంబ్లీకి పంపించి తాను మరింత పెద్ద హోదాలో కొలువుదీరాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తాను కోరుకోకపోయినా సీఎం పదవి తననే వరిస్తుందని.. తాను పదవుల రేసులో లేకున్నా.. అదృష్టం తననే వరిస్తుందని.. సీఎం కుర్చీ మీద తాను ఎంత మనసు పడ్డారో మెరిసే కళ్లతో వివరించారు. 

జానారెడ్డి వ్యాఖ్యలతో సీనియర్ల మనసులో ఏముందోననే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్లు కన్ఫామ్ చేయకముందే.. బరిలో నిలవకముందే.. గెలుపోటముల భవిష్యత్తు తేలకముందే.. అసెంబ్లీకి వెళ్లేదీ లేనిదీ తెలియకుండానే.. ఏకంగా జనారెడ్డి సీఎం కుర్చీ మీద కన్నేయడం టీ-కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. ఔరా.. జానా.. ఆయన మనసులో ఇంత పెద్ద కోరిక తిష్ట వేసుకుని ఉందా.. అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడులో జరిగిన కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి.. ఆ విధంగా తన మనసులోని మాటను బయట పెట్టుకున్నారు. 

వాస్తవానికి టీ-కాంగ్రెస్ లో జానా లాంటి సీనియర్లు చాలా మందే ఉన్నారు. కాబట్టి ఆ సీటుకు పోటీ తీవ్రంగా ఉందని.. వారెవరూ నోరు మెదపకముందే, ఇప్పుడే తాను ముచ్చట పడుతున్న విషయాన్ని రివీల్ చేస్తే.. ఇతరులు ఆ మాటెత్తకుండా ఉంటుందన్న ముందుచూపుతోనే జానా అలా చేశారా? అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి జానారెడ్డి ఎలాగూ సీఎం కుర్చీ మీద మనసు పడ్డారు కదా అని చెప్పి మిగతావారు తమ కోరికను చంపేసుకుంటారా? అలాంటి సెన్సిటివిటీని మెయింటెయిన్ చేసే సంప్రదాయం కాంగ్రెస్ లో ఉండదని.. ఎవరి ఎజెండా, ఎవరి డిమాండ్ వారిదేనని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. 

తన రాజకీయ వారసత్వాన్ని కొడుకులకు సంక్రమింపజేయాలని జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలను జిల్లాలోని రెండు చోట్ల నుంచి రంగంలోకి దింపి వారిని గెలిపించుకోవాలని.. మరో సీట్లో తను పోటీ చేసి రాష్ట్రంలో అత్యున్నత పదవిని అలంకరించాలని కలలు కంటున్నారు. అయితే టీ-పీసీసీ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చాక జానా లాంటి సీనియర్లకు సైతం ముకుతాడు పడినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి తను అసెంబ్లీ బరిలో ఉండే అవకాశం లేదని తెలిసినప్పటికీ.. సీఎం కుర్చీ గురించి కామెంట్లు చేయడం చర్చాంశంగా మారింది. మరోవైపు జానా తన వ్యాఖ్యలను తానే బలపరుచుకుంటూ.. పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో గెలవకుండానే సీఎం అయ్యారు కదా.. అలాంటి అవకాశమే తనకూ వస్తుందని.. అలా అపురూపమైన అవకాశం తన్నుకొచ్చినప్పుడు దాన్నెవరూ ఆపలేరని.. మైకు బద్దలు కొట్టారు జానా. ఆ పదవి తనను వెదుక్కుంటూ వస్తే.. ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత తన కొడుకు రాజీనామా చేస్తాడని.. అప్పుడు తానే మళ్లీ ఎమ్మెల్యే అవుతాననీ... అన్నీ ఆలోచించి పెట్టుకుంటున్నారు జానా. 

జానా లాంటి సీనియర్లకు టీ-కాంగ్రెస్ లో కొదువ లేదు. వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, రేణుకాచౌదరి.. లాంటివారు చాలా మందే ఉన్నారు. జగ్గారెడ్డికి సీటు కన్ఫామ్ అయినా.. చాలా మంది ఫైర్ బ్రాండ్లకు సీట్లు దక్కడం అనుమానాస్పదంగానే ఉందంటున్నారు నేతలు. దీంతో ఇప్పుడు సరికొత్త నినాదాలు కూడా ముందుకొస్తున్నాయి. తెలంగాణలో గెలుపును అందుకోబోతున్న పార్టీగా నాయకులందరూ సంబరపడుతున్నా.. తమకు గనక టికెట్ రాకపోతే పార్టీ తడాఖా చూపుతాం అనే రేంజ్ లో పలువురు నేతలు గరం అయిపోతున్నారు. రేణుకాచౌదరి లాంటి సీనియర్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయితే గతంలో ఎప్పుడూ లేని సరికొత్త ఈక్వేషన్స్ ముందుకు తీసుకొచ్చి ఢిల్లీ పెద్దలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండడం విశేషం. 

టీ-కాంగ్రెస్ సీనియర్లలో బలరాం నాయక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు కూడా ఉన్నారు. అటు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నందున.. అది సొంత సీటు అయిన షబ్బీర్ అలీ.. సేఫ్ ప్లేస్ చూసుకొని స్థానభ్రంశం చెందాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అలాగే మధుయాష్కీ లాంటి నేతలు కూడా స్థాన భ్రంశం చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సీనియర్లకు టాప్ ప్రయారిటీ ఇస్తే.. స్థానిక సీట్ల మీద కన్నేసిన వారి పరిస్థితేంటి? వారిని ఎలా మెప్పించి ఒప్పించడం.. వారు నిశ్శబ్దంగా ఎలా ఉంటారు? ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేయాల్సిన జానా లాంటి సీనియర్.. ఆ విధులు వదిలేసి.. తనకే సీఎం కుర్చీ కావాలని మనసు పారేసుకుంటే.. ముందుముందు పార్టీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.