Skip to main content

కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం"

టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏది అనుకున్నారో అదే చేశారా? ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో.. ఆయన మైండ్ లో ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకొని ఉన్నారా? తన సొంత నిర్ణయం మేరకే రెండో జాబితాలో టికెట్లు వచ్చాయని.. అంతకు మించి సమన్యాయం గానీ, సామాజిక న్యాయానికి గానీ అందులో చోటే లేదంటున్నారు.. టికెట్ దక్కని నిరాశావహులు. టికెట్ దక్కనివారు ఆ అక్కసుతో మాట్లాడతారని అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పూర్తిగా రేవంత్ మార్కే కనిపిస్తోందని.. ఆయన రెడ్డి సామాజికవర్గం నేతల విషయంలో పక్షపాతం చూపారన్న అసంతృప్తి బలపడుతోంది. 

టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను అనుకున్నదే చేస్తారు తప్ప.. ఇతరులు చెప్పింది చేయరని ఇప్పుడు నిరూపించుకున్నారు. టీ-కాంగ్రెస్ రెండో లిస్టును యథాలాపంగా పరికించినా ఆ విషయం అర్థమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈనెల 15న టీ-కాంగ్రెస్ మొదటిజాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. రెండో జాబితాలో 45 స్థానాలను క్లియర్‌ చేశారు. దీంతో టీ-కాంగ్రెస్ ఇప్పటివరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో జాబితాలోని 45 స్థానాల్లో అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు. బీసీలకు 8 సీట్లు.. ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక్క సీటు కేటాయించారు. ఓవరాల్ గా 100 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 20 శాతం సీట్లు కేటాయించారని.. 53 శాతం సీట్లు ఓసీ వర్గాలకు కేటాయించారంటూ రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీసీలకు కేటాయించిన 20 సీట్లలో యాదవులకు 4, గౌడకు 3, మున్నూరుకాపుకు 3, ముదిరాజ్ కు 3 చొప్పున సీట్లు కేటాయించారు. ఇక పద్మశాలి, ఆరె మరాఠి, వాల్మీకి, మేరు, వంజర, రజక, బొందిలి కులాలకు ఒక్కొక్క సీటు దక్కాయి. ఇక అగ్రవర్ణాల్లోనూ రెడ్లకే పెద్దపీట వేశారంటున్నారు పరిశీలకులు. తాజా రెండో జాబితాను పరిశీలిస్తే అదే విషయం బోధపడుతుందంటున్నారు. 

Read this:  నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

టీ-కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించిన వంద సీట్లలో రెడ్లకు 38 సీట్లు, వెలమలకు 9, కమ్మ సామాజికవర్గానికి 3 సీట్లు, బ్రాహ్మణులకు 3, మైనారిటీలకు 4 సీట్లు కేటాయించి.. మిగిలినవి ఎస్సీ-ఎస్టీ రిజర్వుడ్ స్థానాలకు కేటాయించినట్లు స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఓవరాల్ గా రెడ్డి సామాజికవర్గానికే పక్షపాతంగా వ్యవహరించారంటున్నారు పరిశీలకులు. ఇదే ఇప్పుడు టీ-కాంగ్రెస్ జాబితాపై దుమారం రేపుతోంది. 

తెలంగాణలో సామాజికవర్గాలవారీగా రాజకీయ వాటా దక్కాలన్న పోరాటం చాలా కాలంగా నడుస్తోంది. అతి తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలే రాజ్యాధికారం చెలాయిస్తూ అత్యధిక సంఖ్యలో ఉండే బడుగు వర్గాల ప్రయోజనాలు కాల రాస్తున్నారన్న అసంతృప్తి చాలాకాలంగా చెలరేగుతోంది. అటు బీసీ కులాల నుంచి బీసీలంతా ఒక్కటై.. తమ వాటా ప్రకారం సీట్లు కావాలంటూ నినదిస్తున్నారు. పైగా అలాంటి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించడం విశేషం. తీరా సీట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి రేవంత్ తన పక్షపాత బుద్ధి చూపించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుక్కారణాలేంటని కూడా సామాజిక నిపుణులు ఆరా తీస్తున్నారు. ఆసక్తికరమైన ఆ నేపథ్యాన్ని కూడా ఇప్పుడు వారు గుర్తు చేస్తున్నారు. 

తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని.. పార్టీలకు అతీతంగా రెడ్డి సామాజికవర్గం నేతలందరినీ ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున రెడ్డి నాయకులందరినీ పిలిపించారు. తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి ఆంధ్రా రాజకీయ అధికారంలో రెడ్ల పాత్రను గుర్తు చేస్తూ.. యావత్ సమాజానికి రెడ్లు చేస్తున్న సేవల ఫలితంగా.. నూతన తెలంగాణలో కూడా రెడ్లే అధికారంలో కొనసాగాలని చాలా మంది నేతలను రేవంత్ మోటివేట్ చేసి.. అందరినీ ఆ సమావేశానికి రప్పించారంటారు. ఆ రెడ్ల సభకు పార్టీలకు అతీతంగా రెడ్డి నాయకులందరూ హాజరయ్యారు. తమ రాజకీయ గత వైభవాన్ని, బాధ్యతాయుతమైన సామాజిక నేపథ్యాన్ని గుర్తు చేసుకొని పొంగిపోయారు. ఆ ఊపుతో ఆధునిక తెలంగాణలోనూ మళ్లీ రెడ్ల హవా కొనసాగాలని ఆనాడే నేతలంతా ప్రసంగాలు దట్టించారు. ఆనాటి రెడ్డ నాయకుల మహాసభను చూసి మిగతా సామాజికవర్గాల్లో తీవ్రమైన చర్చే జరిగింది. ఆనాడు రేవంత్ తలపెట్టిన సభ.. సకల జన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా ఉందన్న విమర్శలు ఆనాడే వినిపంచాయి. కోదండరాం వంటి ఉద్యమ నేతలు.. ఆ సభకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం మినహా.. మిగతా చాలా మంది రెడ్డి నాయకులందరూ ఓ రకంగా పూనకం వచ్చిన లెవల్లో ఊగిపోయే ప్రసంగాలు చేశారు. ఆ విషయాన్ని అక్కడ కట్ చేస్తే.. ఇప్పుడు అదే రెడ్ల పట్ల పక్షపాతాన్ని రేవంత్ ప్రకటించుకున్నారన్న విమర్శలు మిగతా బీసీ సమాజం నుంచి వినిపిస్తున్నాయి.

ఇక రేవంత్ రెడ్డి చేసిన నెగెటివ్ ప్రాపగాండాను కేసీఆర్ ఆనాడే గుర్తించారంటారు విశ్లేషకులు. ఆ మేరకే కేసీఆర్ కేబినెట్లకే సామాజికవర్గాలవారీగా న్యాయం పాటించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఓ విలేకర్ల కేసీఆర్ ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. ప్రతిసారీ కులం గురించి, సామాజికవర్గం గురించి సంకుచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాణ్ని తాను కాదని.. ఆ విధంగా ఆలోచించినా.. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుందని ఇండైరెక్టుగా రేవంత్ కు చరకలంటించారు. వెలమ సామాజికవర్గం జనాభా ఎంతుంటుందో కూడా కేసీఆర్ ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక్క శాతం కంటే తక్కువ ఉండే తమ సామాజికవర్గం పరిపాలిస్తున్నప్పుడు.. మిగతా అందరినీ సమతూకం చేసుకొని ముందుకెళ్తుందని.. కొన్ని నిర్ణయాలు అవసరాలకు తగినట్టుగా ఉంటాయే తప్ప.. అందలో పక్షపాతం ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. ఇప్పుడా విషయాలను కూడా విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. 

తెలంగాణలో పూర్తి బలహీనపడిన కాంగ్రెస్ ను తన మార్కు ప్రసంగాలు, తన మార్కు దూకుడుతో గ్రాఫ్ పెంచేలా చేసి.. తాను తీసుకోబోయే ఎలాంటి నిర్ణయాలకైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితులు సృష్టించుకున్నారని.. దాన్ని ఆసరా చేసుకొనే దాదాపు ఆరు శాతం ఉన్న రెడ్డి సామాజికవర్గానికి అత్యధిక సీట్లు కట్టబెట్టారంటున్నారు. ఇదంతా గతంలో జరిపిన రెడ్డి సభలోని ఎజెండా ప్రభావమేనని.. ఆయన ప్రకటించిన సీట్ల ద్వారా ఎలాంటి సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పలువురు ఆశావహులు వాపోతున్నారు. మరోవైపు.. సూర్యాపేట బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా.. బీజేపీ తరఫున తాము బీసీలకే ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రకటనను ఇప్పటికే పలు బీసీ సంఘాల నేతలు స్వాగతించడం విశేషం. 

ఇక టీ-పీసీసీ విడుదల చేసిన ఈ జాబితాలో మిగతా అగ్రవర్ణాల కన్నా, అధిక సంఖ్యలో ఉన్న బీసీల కన్నా ఒక్క రెడ్లకే పెద్దపీట ఎలా వేస్తారన్న విమర్శలు ఒకవైపు వినిపిస్తుంటే.. అటు సొంత పార్టీ నుంచి కూడా టికెట్ దక్కని వారు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. మరి.. ఈ అసమతుల్యతను రేవంత్ రెడ్డి ఎలా సర్దుతారు? మిగతా 19 సీట్ల కేటాయింపుల్లోనైనా అది ప్రతిఫలిస్తుందా? ఒక్క వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న అపవాదును ఎలా తొలగించుకుంటారు? వేచి చూడాల్సిందే. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.